ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : జీవితంలో నెగెటివ్ చాఫ్టర్లకు ఫుల్స్టాప్ పెట్టి, కొత్త అధ్యాయం మొదలు పెట్టాలన్న సంకల్పానికి మానిక్ అలీ అనే వ్యక్తి విచిత్రమైన ఉదాహరణగా నిలిచాడు. భార్యతో విడాకులు తీసుకున్న ఆనందంలో 40 లీటర్ల పాలతో స్నానం చేసి, ‘పునర్జన్మ’ సాధించానని ప్రకటించాడు. ఈ సంఘటన నల్బాడీ జిల్లా ముకుల్మువా గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ముకుల్మువా గ్రామానికి చెందిన మాణిక్ అలీ కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. మొదట్లో అన్నీ సజావుగా సాగినప్పటికీ, కొన్ని సంవత్సరాల తర్వాత భార్య ప్రవర్తనలో మార్పులు రావడం ప్రారంభమైంది.భార్య తన ప్రియుడితో కలిసి రెండు సార్లు ఇంటి నుండి పారిపోయిందని మాణిక్ అలీ తెలిపారు. మొదటి సారి మన్నించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారని, తమ బిడ్డ భవిష్యత్ కోసం మళ్లీ కుటుంబంగా జీవించాలని ప్రయత్నించానని వివరించారు. కానీ అదే తీరు మళ్లీ తిరిగిరావడంతో, చివరికి న్యాయస్థానం ద్వారా విడాకులు తీసుకోవలసి వచ్చిందన్నారు.తనపై జరిగిన సంఘటనలన్నింటినీ మర్చిపోయేందుకు, జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు ఓ ప్రత్యేక సంబరాన్ని మాణిక్ అలీ ఏర్పాటు చేసుకున్నారు. స్థానికంగా బంధుమిత్రుల సమక్షంలో 40 లీటర్ల పాలు తెప్పించి అందులో స్నానం చేశారు.ఈరోజు నాకు పునర్జన్మ లభించిన రోజు. ఆ బంధం నాకు బాధే మిగిల్చింది. ఇకపై మళ్లీ ఆ జ్ఞాపకాల వైపు తిరిగి చూసుకోను. జీవితాన్ని సానుకూలంగా చూసే ప్రయత్నం చేస్తా," అంటూ మాణిక్ అలీ పేర్కొన్నారు.
గ్రామస్తుల ఆశ్చర్యం, మద్దతు...
ఈ ఘటన ముకుల్మువా గ్రామంలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. కొంతమంది దీనిని హాస్యాస్పదంగా చూడగా, మరికొందరు మాణిక్ అలీ ధైర్యాన్ని అభినందిస్తున్నారు. "ఇలాంటి తాత్కాలిక బాధల నుంచి బయటపడటానికి మానసికంగా ఈ తరహా ప్రకటనలు చేయడం వలన కొంత ఉపశమనం లభించవచ్చు," అని స్థానిక పెద్దలు అభిప్రాయపడ్డారు.
పాలతో స్నానం వెనక ఉన్న విశ్వాసం....
హిందూ సంప్రదాయంలో పాలతో స్నానం పవిత్రతకు, శుద్ధికి, కొత్త ప్రారంభానికి ప్రతీకగా భావిస్తారు. అదే తరహాలో మాణిక్ అలీ కూడా తన గతాన్ని శుభ్రముచేసి కొత్త జీవితం ప్రారంభించాలన్న సంకల్పంతో పాలతో స్నానం చేసినట్టు తెలిపారు.మాణిక్ అలీ చేసిన ఈ చర్యతో, ‘విడాకులు’ అనే పదాన్ని ఒత్తిడిగా కాకుండా, ఒక అవకాశంగా ఎలా తీసుకోవచ్చో చూపించారు. బాధతో మౌనంగా ఉండకుండా, దాన్ని ఓ సంబరంగా మార్చడం వలన మనసుకు ఉపశమనం లభించవచ్చన్న సందేశాన్ని ఆయన అందించారు.ఇప్పటి నుంచి నా జీవితం నాతోనే ఉంటుంది. నా కుమారుడి కోసం నా బాధ్యతలు నిర్వర్తిస్తాను. ఇకపై ఎలాంటి సంబంధం అవసరం లేదు. ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలన్నదే నా ఆశయం," అంటూ మాణిక్ అలీ తన భవిష్యత్తు పట్ల తన ఆకాంక్షను వెల్లడించారు.మాణిక్ అలీ కథ, ఒక పాఠంగా నిలుస్తోంది. ప్రేమలో మోసపోయిన వ్యక్తి, వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఎలా నిలబడవచ్చో చక్కగా చూపించారు. సమాజం నుంచి కూడా అతనికి మద్దతు లభించడమే కాక, అతని ధైర్యానికి హర్షధ్వానాలు పలికారు.జీవితంలో వచ్చే నష్టాలను మనుగడకు ప్రమాదంగా కాక, అభివృద్ధికి అవకాశంగా మార్చుకున్న మాణిక్ అలీ ఉదాహరణ ఓ పాఠం. విరహాన్ని ఆనందంగా మార్చుకున్న ఈ సంఘటన, నల్బాడీ జిల్లా ద్వారా దేశవ్యాప్తంగా ప్రేరణగా మారుతోంది.
Admin
Aakanksha News