ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గని కార్మికుల హక్కులపై తన ప్రత్యేక దృష్టిని మరింత ప్రగాఢం చేస్తూ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సింగరేణి కార్మిక రంగంపై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవితను త్వరలో ప్రకటించను ఉండడంతో కార్మిక సంఘాల మధ్య చర్చలకు కొత్త దారులు తెరచుకున్నాయి.తెలంగాణ జాగృతి ద్వారా సింగరేణిలో ‘సింగరేణి జాగృతి’ అనే కార్మిక వేదికను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సింగరేణి కార్మిక సంఘాల నాయకులతో కవిత వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. తెలంగాణ జాగృతికి అనుబంధంగా ఈ వేదికను ఏర్పాటు చేసి, బొగ్గు గనుల్లో కార్మికుల సమస్యలపై సమగ్ర పోరాటం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హెచ్ఎంఎస్, తెలంగాణ జాగృతి కలసి పనిచేసే విధంగా చర్చలు సాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన హైదరాబాదులోని కవిత నివాసంలో భారీగా కార్మిక నాయకులు చేరనున్నట్లు సమాచారం. అదే రోజు ఎస్ఎంఎస్ జాగృతి కార్మిక నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో సింగరేణి కార్మికుల సమస్యలు, హెచ్ఎంఎస్తో కలిసి చేపట్టబోయే ఉద్యమాలపై చర్చలు జరగనున్నాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి ప్రత్యామ్నాయంగా ‘సింగరేణి జాగృతి’ను మద్దతుగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా, పలువురు కార్మిక సంఘాల నేతలు ఇప్పటికే కవితతో సంప్రదింపులు జరుపుతున్నారు. సింగరేణిలో భవిష్యత్ కార్మిక రాజకీయాలను ప్రభావితం చేయగల నిర్ణయాలు ఈ సమావేశాల ద్వారా వెలువడే అవకాశం ఉంది.సమస్యలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందుతుండడంతో కార్మికుల దృష్టి కొత్త వేదికలపై పడుతున్న నేపథ్యంలో కవిత వ్యవహారం కీలకంగా మారింది. కార్మికుల మద్దతుతో బలమైన వేదికను నిర్మించేందుకు కవిత కసరత్తు ప్రారంభించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇకపై సింగరేణిలో కార్మిక హక్కుల కోసం పోరాటం మరింత ఉత్కంఠ భరితంగా సాగనున్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
Admin
Aakanksha News