Thursday, 30 July 2026 01:15:50 PM

ఏపీలో జంప్ జిలానీలు ఎక్కువ అయ్యారు: మంత్రి బొత్స

Date : 18 January 2024 06:41 PM Views : 394

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. జంప్ జిలానీలు ఎక్కువ అయ్యారు. ముఖ్యంగా.. వైసీపీ నేతలు టీడీపీ, జనసేన పార్టీలలోకి చేరుతున్నారు. ఈ విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమేనని అన్నారు. ఎవరైనా, ఎప్పుడైనా, ఏ పార్టీలో అయినా చేరొచ్చని చెప్పారు. ఈ అంశంపై పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయంపై తాము ఈరోజు (18/01/24) నిర్వహించిన సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. క్రీయాశీలక కార్యకర్తలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడనున్నారని పేర్కొన్నారు.ఈ నెల 25వ తేదీన భీమిలిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు సుమారు మూడు లక్షల మంది హాజరుకానున్నారని మంత్రి బొత్స తెలిపారు. దళారులు, మధ్యవర్తులు లేకుండా పరిపాలన చేస్తున్నామని, విశాఖ కేంద్రంగా రాజధాని వస్తుందని స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యులు 2004, 2009లోనే పోటీ చేశారని.. ఇప్పుడే కొత్తగా ఎన్నికల బరిలోకి దిగడం లేదని చెప్పారు. వైఎస్ఆర్, జగన్ పాలనలోనే విశాఖలో ప్రాజెక్టులు వచ్చాయన్నారు. టీడీపీ నాయకులు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయడమే తమ సంకల్పమన్నారు. అయితే.. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో.. పిల్లలు, తల్లిదండ్రుల కోరిక మేరకే ఈనెల 21వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు పెంచామన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :