Sunday, 26 April 2026 05:37:21 PM

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదు...

కేంద్ర ప్రభుత్వం వెల్లడి

Date : 04 October 2024 07:06 PM Views : 287

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించి “ తగిన శిక్షలు ” ఉన్నాయని, ఇది చట్టబద్ధమైన అంశానికి మించిన సామాజిక సమస్య అని కేంద్రం వెల్లడించింది. ఇది సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, అందుకే దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఈమేరకు సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం ,మైనర్ కాని భార్యను లైంగికంగా బలవంతం చేస్తే అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొంది.ఒకవేళ అలా చేస్తే దాంపత్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని , వివాహ వ్యవస్థలోనూ తీవ్ర అవాంతరాలకు దారి తీస్తుందని తెలిపింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే అంశం సుప్రీం కోర్టు పరిధి లోకి రాదని, అన్ని రాష్ట్రాలు , భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోకుండా దీనిపై ఓ నిర్ణయం తీసుకోలేమని వెల్లడించింది. వివాహం చేసుకోవడం వల్ల మహిళ ‘సమ్మతి’ తొలగిపోయినట్టు కాదని, దాన్ని ఉల్లంఘిస్తే తగువిధంగా శిక్షలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటించింది. వివాహిత సమ్మతిని రక్షించేందుకు చట్టపరమైన నిబంధనలు సహా ఇతర పరిష్కార మార్గాలను పార్లమెంట్ అందించిందని తెలిపింది. మహిళా స్వేచ్ఛ, గౌరవం, హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :