ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : ఇంకా రూ.6,839 కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. 2023 మే 19న రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. నాటి నుంచి నవంబర్లో వ్యాపారం ముగిసే సమయానికి చలామణి నుంచి దాదాపు 98.08 శాతం మేర రూ.2వేల నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం రూ.6,839 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది.కాగా, 2023 మే 19న చలామణి నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. నాడు చలామణిలో ఉన్న ఈ నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు. ఇదిలావుంటే నిరుడు అక్టోబర్ 7దాకా దేశంలోని అన్ని బ్యాంక్ శాఖల్లో రూ.2,000 నోట్ల మార్పిడి జరిగింది. ఆ తర్వాత నుంచి హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ మార్పిడికి వీలుంది.అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ శాఖల్లో రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు. కాగా, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2016లో రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు చలమాణిలో ఉన్న రూ. 1,000, రూ.500 నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను చలామణిలోకి తెచ్చింది.
Admin
Aakanksha News