ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఆయనపై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలకలం సృష్టించారు. వెంటనే అప్రమత్తమైన లండన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు.కాగా, జై శంకర్ ఈనెల 4న యూకే పర్యటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పర్యటనలో భాగంగా 9వ తేదీ వరకూ అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో పలు సమావేశాలకు హాజరవుతున్నారు. బుధవారం రాత్రి లండన్లోని ఛాఠమ్ హౌస్ లో నిర్వహించిన అధికారిక సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశాలు ముగించుకొని బయటకు వచ్చిన సమయంలో కొందరు ఖలిస్థానీ అనుకూల వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఖలిస్థానీ జెండాలను ప్రదర్శిస్తూ భారత్, కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ గుంపులోని ఓ వ్యక్తి భారత జెండాను చేత పట్టి మంత్రి కారుకు అత్యంత సమీపంలోకి దూసుకొచ్చాడు. జాతీయ జెండాను అవమానించేలా ప్రవర్తించాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కారువైపు దూసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Admin
Aakanksha News