ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ స్థాయిలో నగదు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని కొందరు డిమాండు చేయగా జస్టిస్ వర్మను అభిశంసించాలని మరికొందరు సూచించారు. ఇది చాలా పెద్ద విషయమని, న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతిన్నదని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ సోమవారం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వర్మ ఇంట్లో నగదు రికవరీ అంశంపై చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.ఈ వ్యవహారం తీవ్రమైనదిగా చైర్మన్ అభివర్ణించారు. ఈ అంశంపై సభలో అధికార, ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరిపినట్లు చెప్పారు. వారి సూచనల మేరకు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘జస్టిస్ వర్మ విషయంపై చర్చించేందుకు ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశాను’ అని మంగళవారం రాజ్యసభలో చైర్మన్ అన్నారు. ఈ సమస్య చాలా తీవ్రమైనదని, ఈ అంశంపై ఫ్లోర్ లీడర్లతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
Admin
Aakanksha News