Thursday, 30 July 2026 02:56:09 PM

జనవరి 22 న ఒడిశాలో మరో రామమందిరం ప్రారంభం..

Date : 20 January 2024 06:05 AM Views : 687

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : జనవరి 22వ తేదీ రామ భక్తులకు ఎంతో ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన దినమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఆరోజు అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది. అలాగే.. అదే రోజున ఒడిశాలో నిర్మించిన రామమందిరాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలోని ఫతేగఢ్ గ్రామంలో ఈ మందిరాన్ని నిర్మించారు. అయోధ్యలోని రామమందిరాన్ని జనవరి 22వ తేదీన ప్రారంభించనున్న తరుణంలో.. అదే రోజున ఈ ఆలయాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం ఘనంగా నిర్వహించారు.ఈ ఆలయ నిర్మాణం 2017లో ప్రారంభమైంది. ఫతేఘర్‌లో సముద్ర మట్టానికి 1,800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ఓ కొండపై ఉంది. ఈ ఆలయం ఎత్తు 165 అడుగులు. ‘బౌలమాల’ అనే రాయిని ఉపయోగించి దీనిని నిర్మించడం జరిగింది. ఈ మందిర నిర్మాణంలో 150 మందికి పైగా కార్మికులు ఏడేళ్లుగా పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని నిర్మాణం వెనుక ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఈ పర్వతంపై గోవర్ధనుడు కొన్ని దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్నాడు. అలాగే.. 1912లో జగన్నాథుడి నవకళేబర సమయంలో సుదర్శన్ చెట్టును ఫతేఘర్ నుండి సేకరించారు. దీనిని స్మరించుకునేందుకు.. గ్రామస్తులు చొరవ తీసుకుని శ్రీరామ సేవా పరిషత్‌ అనే కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీకి సోషల్ యాక్టివిస్ట్ అయిన భాపూర్ బ్లాక్ వైస్-చైర్‌పర్సన్ అధ్యక్షునిగా నియమితులైన తర్వాత ఈ రామ మందిర పనులను ప్రారంభించారు. జనవరి 21వ తేదీ నుంచి ఈ రామమందిర ప్రారంభోత్సవ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిసింది. ఈ ఆలయ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా.. పూరీ శంకరాచార్య, మహారాజుకు ఆహ్వానం అందింది. అంతేకాదు.. పూరీలోని ప్రముఖ జగన్నాథ ఆలయంలో ఉన్న వారితో పాటు వివిధ ఆలయాల అధికారులకు ఆహ్వానాలు పంపబడ్డాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :