ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ సందర్భంగా షర్మిలకు వారు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల వెంట ఆమె భర్త అనిల్ కుమార్ ఉన్నారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తాను వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానన్నారు. ఆయన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీని విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. రాహుల్ గాంధీ జోడో యాత్రతోనే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం తన తండ్రి కలగా చెప్పారు. ఆ కలను నిజం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం తాను తెలంగాణలో పోటీ చేయలేదని.. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ దేనని షర్మిల తెలిపారు.
Admin
Aakanksha News