ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / హైదరాబాద్ : నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) శిక్షణా కేంద్రం ప్రముఖ ట్రైనింగ్ సెంటర్గా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. సుపరిపాలనకు నాసిన్ సరికొత్త కేంద్రంగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పరిపాలనా దక్షతకు శ్రీరాముడు మారుపేరు అని, ఆయన పాలన ఇప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ రామరాజ్యం మనందరికీ ఆదర్శప్రాయం. రామరాజ్యం గురించి మహాత్మాగాంధీ అనేక సార్లు ప్రస్తావించారు. ప్రజలకు సుపరిపాలన అందాలని గాంధీ చెప్పారు’’ అని ప్రస్తావించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం సమీపంలో ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) శిక్షణా కేంద్రాన్ని ఆయన ఈ రోజు (మంగళవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘శ్రీరాముడు దేశ ప్రజలందరికీ ప్రేరణ. అక్రమంగా వచ్చే అధికారాన్ని స్వీకరించొద్దని చెప్పాడు’’ అని అన్నారు. అధికారులు కూడా రాముడిని ప్రేరణగా తీసుకొని పనిచేయాలని అన్నారు. ధర్మానికి, నిష్పక్షపాత విధానాలకు రాముడు నిదర్శనమని, దేశమంతా ఇప్పుడు రామమయం అయ్యిందని అన్నారు. అయోధ్య ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతక్రితం లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. స్వామి వారిని దర్శించుకున్నారు. వీరభద్రస్వామి దర్శనం ఆనందం కలిగించిందని మోదీ చెప్పారు.
Admin
Aakanksha News