Thursday, 30 July 2026 03:10:50 PM

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎదురుదెబ్బ..

Date : 16 January 2024 07:24 PM Views : 411

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణకు అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో ఏపీజీఈఏ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన అభ్యర్థనను హైకోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంలో సవాలు చేశారు. సెప్టెంబర్ 15న సూర్యనారాయణకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం ధర్మాసనం అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. విచారణకు సహకరించాలని సూర్యనారాయణను ఆదేశించింది. ఆ తర్వాత రెండు సార్లు విచారణకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 12న విచారణకు వచ్చిన సందర్భంలో తాము 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. సూర్యనారాయణను ఎన్నిసార్లు విచారణకు పిలిచారు.. విచారణకు సహకరించారా లేదా.. కేసులో ఏం జరుగుతుందో వివరాలన్నీ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసు ఈరోజు మరోసారి విచారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నుంచి ధర్మాసనం వివరాలు అడిగింది. సూర్యనారాయణ పలుకుబడి ఉన్న వ్యక్తి అని.. ఉద్యోగులు ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వరు అని, ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.ప్రభుత్వ న్యాయవాది తప్పుడు సమాచారం ఇస్తున్నారని సూర్యనారాయణ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. సూర్యనారాయణను ఒకసారి విచారణకు పిలిచారని, అది కూడా ఈనెల 14న నోటీసులు ఇచ్చి 15న విచారణకు పిలిచినట్లు ధర్మాసనానికి తెలిపారు. వాదోపవాదనలు విన్న తర్వాత జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు సహకరిస్తున్నారంటూనే అనేక భిన్నమైన అంశాలు ఎలా తీసుకువస్తారు అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 15న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సవరిస్తూ ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :