ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం, ఫరూక్నగర్ మండలంలోని గంట్లవెల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మళ్లీ ఆకతాయిల బారిన పడింది. తెలియని దుండగులు పాఠశాల భవనంలోని సీలింగ్ ఫ్యాన్లను బలవంతంగా విరిచేసి అక్కడి వాతావరణాన్ని కలకలం రేపారు.గత మూడు రోజులుగా వరుసగా సెలవులు ఉండటంతో పాఠశాల మూసివేసి ఉండగా, సోమవారం ఉదయం పాఠశాలను తెరిచిన సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. పాఠశాల తరగతి గదులలోని ఫ్యాన్లు విరిగిపడి ఉండటంతో అందరి ఆగ్రహం వ్యక్తమైంది. ఇది ఈ పాఠశాలలో జరిగిన రెండోసారి దాడి కావడం గమనార్హం. కొద్దికాలం క్రితమే ఇదే విధంగా ఫ్యాన్లను ధ్వంసం చేసిన సంఘటన చోటుచేసుకుంది.ఇలాంటి విద్యాలయాలపై దాడులు చేయడం అంటే పిల్లల భవిష్యత్తుతో ఆటలాడటమే" అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. "ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?" అంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. పాఠశాలలో చదువుకునే చిన్నారుల హక్కులను కాపాడటానికి ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.స్థలాన్ని పరిశీలించిన సిబ్బంది, ఫ్యాన్లపై స్పష్టంగా చేతుల ముద్రలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.ఈ తరహా సంఘటనలు వరుసగా జరగడం పాఠశాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా, విద్యా విభాగం తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Admin
Aakanksha News