ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / యాదాద్రి భువనగిరి జిల్లా : పది రూపాయల కాయిన్ మింగిన చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన శనివారం భీమనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ధ్యానమైన శేఖర్–జ్యోతి దంపతుల కుమార్తె నిహారిక (10) స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆటలలో భాగంగా పది రూపాయల కాయిన్ను మింగేసింది.ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు బాలికను వనస్థలిపురంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేసి కాయిన్ను తొలగించారు. శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేసిన బాలిక శనివారం తెల్లవారుజామున ఆకస్మిక అస్వస్థతకు గురైంది. నిద్రలేపేందుకు ప్రయత్నించగా బాలిక ముఖం ఆకుపచ్చగా మారి అపస్మారక స్థితిలో కనిపించింది.వెంటనే తల్లిదండ్రులు తిరిగి అదే ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మరణించిందని ప్రకటించారు. ఆపరేషన్లో నిర్లక్ష్యం, ఇన్ఫెక్షన్ కారణంగానే నిహారిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగిన వారు వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో చిన్నారి మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
Admin
Aakanksha News