ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను ఖమ్మం సిసిఎస్, రూరల్ రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏసీపీ తిరుపతిరెడ్డి ఈ విషయాలను వెల్లడించారు. రఘునాధపాలెం మండలం రేగులచర్ల గ్రామానికి చెందిన జంగా వెంకన్న, వెల్లబోయిన లక్ష్మణరావు, కొత్తగూడెం జిల్లా ఎదురుగడ్డకు చెందిన పల్లపు సంపత్తులు ముఠాగా ఏర్పడి పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సిసిఎస్ సివిల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారని వివరించారు. విచారణలో నిందితులు ఖమ్మం రూరల్ మండలం కామంచికల్, గొల్లగూడెం, మద్దులపల్లి గ్రామాలతో పాటు నేలకొండపల్లి, కానాపురం, రఘునాధపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ వరుస దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు.నిందితుల వద్ద నుంచి 190 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 20 లక్షల రూపాయల విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం వారిని జిల్లా కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. ఈ కేసు విజయవంతంగా చేధనలో భాగంగా రూరల్ పోలీస్ స్టేషన్ పీసీలు శ్రీనివాస్, దశరథ, నాగేంద్రప్రసాద్, రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ పీసీ సంజీవ్ కుమార్, సిసిఎస్ సిబ్బంది హరికృష్ణ, నరసింహరావు, సుధీర్, సంజీవ్, జానీ పాషా, మంగ్త్యలను ఏసీపీ తిరుపతిరెడ్డి అభినందించారు.
Admin
Aakanksha News