ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : డీజీపీ ఇతర ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ పోలీస్ కమీషనరేట్ ఎఆర్, స్పెషల్ పార్టీ, వివిధ వింగ్స్ సిబ్బంది మరియు కమీషనరేట్ పరిధిలోని హోంగార్డ్ సిబ్బందితో నిర్వహించిన దర్బార్ కు హాజరై సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఎవరైనా సమస్యలు ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సిబ్బంది కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు అధికారం చేస్తే భవిష్యత్తులో శాఖ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. పెద్దపల్లి మంచిర్యాల జోన్ లలో 494 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని, పోలీసు శాఖలో అంతర్గత భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని, ప్రతి పోలీస్ స్టేషన్ లో పోలీసు సిబ్బందితో బాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహించారని, ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో పని చేస్తున్నప్పుడు సర్వీస్ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించరాదని, డ్యూటీలో ఉన్న ఆఫ్ డ్యూటీలో ఉన్న పోలీస్ శాఖ ప్రతిష్టను భంగపరిచే విధంగా ప్రవర్తించరాదని, అందరూ క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. కొంతమంది వారి స్వలాభం కోసం మిమ్మల్ని ప్రలోబాలకు గురిచేస్తే యూనిఫాం సర్వీస్ లో ఉండి నిరసనలు చేయవద్దని క్రమశిక్షణ కలిగి పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. మీమీ సమస్యలు ఏమైనా ఉంటే వారి అధికారులకు, ఏసీపీలకు, డీసీపీలకు లేదా సీపీ కార్యాలయంకు నేరుగా వచ్చి తెలపాలని సూచించారు. పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించ కూడదని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ , ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఎ ఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్ రావు, గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, పీసీఆర్ సీఐ రవీందర్,శ్రీధర్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్, ఆర్ఐ మల్లేశం, సంపత్, ఎస్ఐ లు, సిబ్బంది, హోం గార్డ్స్ పాల్గొన్నారు.
Admin
Aakanksha News