ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ముత్తారం : ఆయిల్ పామ్ సాగు తెలంగాణ రైతుకు భవిష్యత్తులో స్థిర ఆదాయానికి దారితీయగల మార్గమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో ఆయిల్ పామ్ పంట చేతికి రావడం సందర్భంగా గ్రామానికి చెందిన నాంసాని సమ్మయ్య అనే రైతును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ, "రైతు పొలం నిండా లాభాన్ని పండించాలంటే పంటల్లో నూతన దిశగా ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన ఆయిల్ పామ్ ప్రోత్సాహంతో సుమారు మూడేళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితాలు లభిస్తున్నాయని అన్నారు. ఆయిల్ పామ్ 35 ఏళ్లపాటు దిగుబడి ఇవ్వగల సామర్థ్యం కలిగిన పంటగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారని గుర్తు చేశారు. పరంపరాగత పంటలపై ఆధారపడిన రైతుల పరిస్థితి అప్పుల దెబ్బతో చిగురుటాకులా వణికిపోతుంటే, ఆయిల్ పామ్ వంటి దీర్ఘకాలిక సాగు మార్గాలు రైతులకు భద్రమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గంగా మారనున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని, రైతు పెట్టుబడులు దొరకక, కరెంట్, నీటి సమస్యలతో విసిగిపోతున్నారని విమర్శించారు. "రైతు ఆత్మవిశ్వాసం పెరగాలంటే నమ్మకంగా వ్యవస్థలు పనిచేయాలి. రైతుకు భరోసా కలిగించలేని పాలన ఎప్పుడు వెనకడుగు వేసేలా చేస్తుంది," అని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్బంగా సమ్మయ్య చేసిన ప్రణాళిక, ఆయిల్ పామ్ సాగుపై చూపిన నమ్మకాన్ని ఇతర రైతులు స్ఫూర్తిగా తీసుకోవాలని పుట్ట మధుకర్ పిలుపునిచ్చారు.ప్రయోగమే రైతు ఆశ యొక్క ప్రారంభ బిందువు" అనే ధృవ నమ్మకంతో కొత్త పంటల వైపు అడుగులు వేయాలని మధుకర్ సూచించారు.
Admin
Aakanksha News