ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రాజీవ్ యువ వికాస్ తేదీని మరో 10 రోజుల పాటు పెంచాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశం కింద రుణాలు మంజూరు చేయడం కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం గత రెండు రోజులుగా సర్వర్ డౌన్ వల్ల పనిచేయక పోవడం మూలంగా అనేక మంది ఆశావాహులు అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. కావున మరో 10 రోజులు దరఖాస్తు తేదీని పొడిగించడంతో పాటు తహసిల్దార్ కార్యాలయాల్లో కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వెనువెంటనే ఇచ్చే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ చివరి తేదీ ప్రకటించినప్పటికీ చివరి మూడు రోజులు ప్రభుత్వ సెలవులు కావడం పదవ తారీకు నుండి సర్వర్ బిజీ వల్ల అప్లికేషన్ తీసుకోకపోవడం లాంటి అనేక ఇబ్బందులు నిరుద్యోగులు ఎదుర్కొంటున్నారని వారన్నారు. స్వరాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని భావించినప్పటికీ నిరుద్యోగశాతం పెరిగిందే తప్ప తగ్గలేదని ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించలేక పోయినప్పటికీ స్వయం ఉపాధి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని కానీ నిరుద్యోగులందరికీ పారదర్శకంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం మంజూరు అయినప్పుడే ఈ పథకం యొక్క ఫలితం కనిపిస్తుందని అన్నారు. అలాగే రేషన్ కార్డుకు ఒక్కరు అనే నిబంధనను సడలించి పెళ్లిళ్లు చేసుకొని వేరే కుటుంబముగా జీవిస్తున్నటువంటి ఆ కుటుంబ పెద్దను రాజీవ్ యువ వికాస్ పథకానికి అర్హుడిగా చేస్తే అనేక కుటుంబాలు లాభపడే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Admin
Aakanksha News