ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎన్టీపీసీ అధికారులకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సూచించారు. ఈ ఈ మేరకు ఎన్టీపీసీ జ్యోతిభవన్ లో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ... సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలతో పాటు ఐటీ మినహాయింపు వంటి అంశాలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో సింగరేణి, ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను లేవనెత్తుతానన్నారు. అలాగే ఆరోగ్య సమస్యలు లేని కాంట్రాక్టు కార్మికులను యధావిధిగా వయస్సుతో సంబంధం లేకుండా ఉద్యోగంలో కొనసాగించాలని అధికారులకు ఎంపీ సూచించారు. అలాగే కాంట్రాక్టు కార్మికులకు అందించే గేటు పాసుల విషయంలో నెల రోజులకొకసారి కాకుండా ఆరు నెలలకు ఒకసారి పెంచినట్లు అధికారులు ఎంపీకి తెలియజేశారు. మొదటగా ఉదయం గోదావరిఖని జవహర్ లాల్ నగర్ లోని సింగరేణి స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ ను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి ఘన స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా వాకర్స్ సన్మానించారు. అనంతరం సింగరేణి స్టేడియంలో ఉన్న పలు సమస్యలను వారు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. స్టేడియంలో సీనియర్ సిటిజన్స్ కూర్చునేందుకు బెంచీలు కావాలని అలాగే టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని వాకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఎంపీ వంశీకృష్ణ స్థానిక సమస్యలతో పాటు రామగుండం అభివృద్ధికి సహకరిస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గోదావరిఖనిలో అంబేద్కర్ భవనంతో పాటు సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలియజేశారు.
Reporter
Aakanksha News