ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి హైమావతి–శ్రీనివాస్ దంపతులు భూముల విక్రయం పేరుతో, అప్పుల పేరుతో లక్షలాది రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకపోగా, తమపైనే ఫిర్యాదులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై శుక్రవారం పెద్ద ఎత్తున గ్రామస్థులు గుమ్మడి హైమావతి ఇంటి ఎదుట వంటవార్పు చేస్తూ నిరసనకు దిగారు. “మా డబ్బులు మాకు ఇప్పించండి… మాకు ప్రాణరక్షణ కల్పించండి… న్యాయం చేయండి” అంటూ గట్టిగా నినాదాలు చేశారు. బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ, గుమ్మడి శ్రీనివాస్ తన వద్ద నుండి మూడు సంవత్సరాల క్రితం రూ.21 లక్షలు తీసుకుని పది గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పినా, ఆ భూమిని అప్పటికే మరొకరికి విక్రయించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వ్యక్తి 2011లో రూ.4 లక్షలు అప్పు ఇచ్చినా ఈ రోజువరకు తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే 2013లో రూ.3.50 లక్షలు, 2014లో రూ.2.50 లక్షలు అప్పుగా తీసుకుని ఇప్పటికీ చెల్లించక పోవడంతో పాటు బదులుగా స్థలం రాసి ఇస్తానన్న హామీ కూడా నెరవేర్చలేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులే ఈ దంపతుల అక్రమాలను బహిర్గతం చేశారు. గుమ్మడి శ్రీనివాస్ సోదరుడు రామకృష్ణ మాట్లాడుతూ, తమ తల్లి పేరున నాలుగు ఎకరాలు, తండ్రి పేరున మూడు ఎకరాలను శ్రీనివాస్ అక్రమంగా తన పేరిట పట్టా చేసుకున్నాడని ఆరోపించారు. ఆలస్యంగా ఈ విషయం తెలిసి ప్రశ్నించగానే తమపై వేధింపులు ప్రారంభించాడని ఆవేదన వ్యక్తం చేశారు. హైమావతి సోదరుడు మోహన్ కుమార్ మాట్లాడుతూ, తమ కుటుంబానికి చెందిన విశాఖపట్నంలో 35 సెంట్ల భూమిని ఆమె అక్రమంగా తన పేరిట పట్టా చేసుకుందని తెలిపారు.ఈ పరిణామంతో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు బాధితుల పక్షాన చేరి మద్దతు తెలిపారు. బాధితులు ఒక్కటే స్వరం వినిపించారు – “మాకు రావాల్సిన డబ్బులు, భూములు తిరిగి ఇవ్వండి. లేకపోతే న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు.
Admin
Aakanksha News