ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : విప్లవ సంస్థల విలీన ఐక్య ఉద్యమాల ద్వారానే సాధ్యమని సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్ అన్నారు.పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో ఈ నెల 28న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ విలీన సభ గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొల్లూరి మల్లేష్ మాట్లాడుతూ.. 2013 లో వివిధ కారణాల రీత్యా విడిపోయిన న్యూడెమోక్రసీ పార్టీలు విలీనం అవ్వాలనుకోవడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. నేడు దేశంలో మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. సామ్రాజ్యవాద కంపెనీలకు, కార్పోరేట్ సంస్థలకు యావత్ దేశ సంపదను కట్టబెడుతున్నదని, మతం పేరుతో చిచ్చు పెట్టి దేశ ప్రజల మధ్యన వైశ్యామ్యాలు సృష్టిస్తూ నరహంతక పాలన కొనసాగిస్తున్నదని దుయ్యబట్టారు.ఇటువంటి పరిస్థితులలో దేశంలో ఉన్న అన్ని విప్లవ పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు, ఇందులో భాగంగానే సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రెండు విప్లవ పార్టీలు కలిసి డిసెంబర్ 28న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీనసభ ను జరుపుకుంటున్నాయని, ఈ యొక్క సభకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు-కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య, పార్టీ డివిజన్ నాయకులు వేల్పుల సాంబన్న, పైడిపల్లి రమేష్, కట్కూరి వెంకటేష్, బి రమేష్, కే కేశవ్, కే రమేష్, అల్వాల లింగయ్య, భూక్య రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News