ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని రురల్ : మంథని నియోజకవర్గంలో తండ్రి విగ్రహాలు తప్ప మహనీయుల విగ్రహాలు పట్టని ఎమ్మెల్యే... అని బారత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్ పార్టీనేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా మంథని పట్టణంలోని రాజగృహా నుంచి మహనీయుల స్పూర్తి దీక్షాపరులతో కలిసి ఆయన అంబేద్కర్ శోభాయాత్రను ప్రారంభించారు. ప్రధాన చౌరస్తా, అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్, బుద్దుడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయినా బారత రాజ్యాంగం, మహనీయుల గురించి చెప్పుకునే అవకాశం లభించడం అదృష్టమని, ఆ తల్లి జన్మనివ్వడం మూలంగానే ఈ అవకాశం దొరికిందన్నారు. అయితే అంబేద్కర్ కొందరికే పరిమితమని చెప్పిన వాళ్లకు ఈనాడు అంబేద్కర్ అందరివాడని అర్థం అవుతుందన్నారు. ఈ క్రమంలోనే అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ పేరు తీసుకోకపోతే కాంగ్రెస్సోళ్లు మన దేవుడి ఫోటోలు పట్టుకునే వారే కాదన్నారు. తాము చెప్పే వరకు అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేయని కాంగ్రెస్ నాయకులు ఈనాడు జయంతి వేడుకలు జరుపుతున్నారని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేసి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని, ఇంకా మంథని లాంటి పట్టణాల్లో పందులు ఉండలేని గుడిసెల్లో మన వర్గాలు ఉండటానికి కారణం ఎవరని ఆలోచించాలన్నారు. సంవిధాన్ బచావ్ అంటూ ఢిల్లీలో రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్కు పట్టుకుని తిరుగుతున్నాడని, అదే విధంగా మంథని లో సైతం రాజ్యాంగం బుక్కు పట్టుకుని తిరుగాలని ఆయన అన్నారు. తన రక్తాన్ని ధారపోసి రెండేళ్ల కష్టపడి తన పిల్లలను సైతం వదులుకుని రాజ్యాంగం రచిస్తే ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ను గుర్తించలేదని, కనీసం బారతరత్న ఇవ్వలేదన్నారు. అంతే కాకుండా రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓడించారని, ఆయన గెలిచిన ప్రాంతాన్ని దేశంలో లేకుండా చేశారని ఆయన వివరించారు. నియోజకవర్గంలో అంబేద్కర్ అందించిన ఓటుతో పదవుల్లోకి వచ్చి తండ్రి విగ్రహాలు పెట్టుకున్నారే తప్ప ఒక్క మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించలేదని, శిలాఫలకాలు లేకుండా ఆగమాగం అంబేద్కర్ విగ్రహాలు ఆవిష్కరణ చేశారని ఆయన అన్నారు. అన్ని వర్గాలకు ఓటు హక్కు ఉండాలని పోరాడి అందించిన ఓటు విలువ మనకు అర్థం కావడం లేదని, ఓటు విలువను కాంగ్రెస్సోళ్లు మాత్రం అర్థం చేసుకున్నారని అన్నారు. మానీఫెస్టోను రాసిన మంథని ఎమ్మెల్యే దానికి తూట్లు పొడిచి మళ్లీ మానీఫెస్టో గురించే గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మన రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ మానీఫెస్టోలో పొందుపర్చిన మహిళలకు రూ2500ల నగదును అందిస్తున్నామని చెప్పారని కానీ ఏ ఒక్కరికి 25పైసలు కూడా ఇవ్వలేదని, అంటే ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరని వారి ఆలోచన అని అన్నారు. మహనీయుల గురించి మనం అర్థం చేసుకోకపోతే మోసపోతూనే ఉంటామని, మోసం చేసేటోళ్లు అలసిపోరని మోసం చేస్తూనే ఉంటారని అన్నారు. మనలో కొంత చైతన్యం కన్పించడంతో మన దేవుడైన అంబేద్కర్ను పూజించక తప్పడం లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. ఆనాడు దేశంలో ఎక్కడా లేని విధంగా 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తనను అంతం చేయాలని చూసినా ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మంథని నియోజకవర్గంలో మహనీయుల స్పూర్తి దీక్ష 15మందితో ప్రారంభమై ఈ ఏడాది 45మందికి చేరిందని, అగ్రవర్ణాల్లోని నాయకులు సైతం దీక్ష తీసుకోవడం అంటే అంబేద్కర్ను అర్థం చేసుకున్నారనే సందేశం ఉందని, వచ్చే ఏడాది దీక్షాపరుల సంఖ్య పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ నివాసంలో దీక్షాపరులతో కలిసి ఆయన సహపంక్తి బోజనం చేశారు,
Admin
Aakanksha News