ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసులు నమోదు చేయడం సరైంది కాదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, VHR ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉన్న నల్లబాలును ఆయన గురువారం పరామర్శించి, కేసుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ... రాజకీయ కక్షపూరిత కారణాలతో పెట్టిన ఈ కేసులు కోర్టులో నిలబడవని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇలాంటి కేసులు నమోదు చేయకూడదు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులను ఉపయోగిస్తోందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమంగా కేసులు పెడుతోందని అన్నారు.బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇప్పటికే ఏర్పాటు చేయబడిందని, రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. "నల్లబాలుకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తాం. ఈ కేసులను లీగల్గా ఎదుర్కొంటాం," అని హామీ ఇచ్చారు. హరీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, "ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి, రాజకీయ కక్షతో కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు.
Admin
Aakanksha News