ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని సింగరేణి సైన్స్ మెడికల్ కళాశాలలో రోజురోజుకు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న మహిళలపై అధికార పార్టీ నాయకుల అండదండలతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామగుండం నియోజకవర్గ స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలను ధరించి బుధవారం మెడికల్ కళాశాల ముందు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త మద్దెల దినేష్, కార్పొరేటర్ ఐత శివకుమార్, ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ఉపాధ్యక్షురాలు గోలివాడ చంద్రకళలు మాట్లాడుతూ... మెడికల్ కళాశాలలో పని చేస్తున్న మహిళలపై కొంత మంది అధికార పార్టీకి చెందిన చోటమోట నాయకులు కాంట్రాక్టు పద్ధతిన సూపర్వైజర్లుగా చేరి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ లైంగిక వేధింపులకు గురి చేస్తూ అధికార పార్టీని అడ్డం పెట్టుకుంటూ పని చేస్తున్న స్థలాల్లో మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ నానారకాలుగా వేధింపులకు పాల్పడటం సభ్య సమాజం తలదించుకునేలా చేయడం సరైన పద్ధతి కాదని వారు అన్నారు. ఆడపిల్లలపై వేధింపులకు గురి చేస్తున్న కామపిశాచాలపైన కఠిన చర్యలు తీసుకొని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.గత రెండు నెలల క్రిందనే అందులో పనిచేసే సిబ్బంది రాసలీలకు పాల్పడుతూన్న తరుణంలో వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిందని, అయినప్పటికీ కాంట్రాక్టర్ ఇటు ప్రిన్సిపల్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మరవకముందే మరొక సూపర్వైజర్ ఒక మహిళాపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడటం సిగ్గుచేటని, దీనిపై ఇంత వరకు కనీసం కాంట్రాక్టర్, ప్రిన్సిపాల్ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంలో ఆంతర్యం ఏమిటి అని వారు ప్రశ్నించారు.సూపర్వైజర్లు, కాంట్రాక్టర్ ప్రిన్సిపల్ కుమ్మక్కైయ్యారని ఆరోపించారు. అసలు మెడికల్ కళాశాలలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంటుందని అన్నారు.కార్మికులు కష్టపడి లాభాలు చేస్తే మెడికల్ కళాశాల కోసం సింగరేణి యాజమాన్యం దాదాపు 520 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వెచ్చిస్తే ప్రతి రూపాయి కార్మికులకు కార్మికుల కుటుంబాలకు ఇక్కడి ప్రాంత ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. మరల ఆడపిల్లలపై ఇలాంటివి పునరావృతం అయితే పోలీసులు కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి శిక్షలు విధించేలాగా చూడాలని వారు డిమాండ్ చేశారు.రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ మెడికల్ కళాశాల పైన, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మెడికల్ కళాశాల ఆవరణలో పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ప్రోత్సహించకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ప్రిన్సిపల్ ని బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News