ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపం పోసి తెలంగాణలో పంట పొలాలకు నీరును అందించి సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గోదావరి నది నుండి ప్రారంభమైన గోదావరి గోస మహా పాదయాత్ర రెండో రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా మద్దతు తెలిపారు. అనంతరం పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామగుండం మాజీ శాసన సభ్యులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద ద్వేషం పెంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని అసత్యపు ప్రచారాలను చేస్తూ తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్నదాతలకు సరిగ్గా నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని కనీసం తాగడానికి రానున్న రోజుల్లో నీరు అందించే పరిస్థితి కూడా లేకుండా పోతుందని దీనికి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రామగుండం నుండి మొదలైన నీటి ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా రాజుకుంటుందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైఖరిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నదులన్నీ జలకళను సంతరించుకున్నాయని పంట పొలాలు సస్యశ్యామలంగా అభివృద్ధి చెందాయనీ అన్నారు. గోదావరి నదిలో గతంలో పడవల పోటీలు నిర్వహించామని కానీ ఇప్పుడు చూద్దాం అంటే నీరే కనిపించకుండా పోతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరువు తెచ్చింది అంటూ తీవ్రస్థాయిలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.
Admin
Aakanksha News