ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఆకాంక్ష డెస్క్ : విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న ట్రాఫిక్ను అదిగమించేందుకు పోచంపల్లి- మన్సూరాబాద్ వరకు ఉన్న పాత రోడ్డు తెరిపించే బాధ్యత నాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆయన మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డితో కలిసి క్రీడా అధికారులు శ్రీ సాయినగర్కాలనీ వద్ద మూసివేసిన రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గతంలో ఉన్న పాత రోడ్డు మ్యాపును ఈటలకు చూపించారు.రోడ్డును మూసి వేయడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను, ట్రాఫిక్ సమస్యలను ఎంపీకి వివరించారు. దాదాపు వంద సంవత్సరాలుగా ఉన్న రోడ్డును కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రిడా) ఏర్పాటుతో అధికారులు రోడ్డుకు అడ్డంగా గోడను కట్టి మూసివేశారని తెలిపారు. ప్రజలకు కలుగుతున్న అసౌకర్యంపై దాదాపు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని నర్సింహారెడ్డి ఎంపీకి వివరించారు. అయినా అధికారులు స్పందించడం లేదని అన్నారు.ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. నగరానికి దూరాన్ని తగ్గించేదిగా ఉన్న మన్సూరాబాద్- పోచంపల్లి రోడ్డును కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తెరిపించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నా రు. ఈ రోడ్డును తెరిపించడం వల్ల విజయవాడ జాతీయ రహదారిపైన ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. ఫోన్లో ఫారెస్టు అధికారులతో మాట్లాడారు. పాత రోడ్డును వదిలి రోడ్డుకు ఇరువైపుల గోడ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ రవీందర్రెడ్డితో పాటు పలువురు కాలనీ ప్రజలు పాల్గొన్నారు. అభివృద్ధి వైపు అడుగులు వేయాలి.. కాలనీవాసులంతా ఐక్యమత్యంతో సమస్యలపై పోరాటం చేసినప్పుడే కాలనీలు త్వరగా అభివృద్ధి చెందుతాయని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీ కమ్యూనిటీహాల్లో ఆ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కాలనీ 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చెరువు లోతట్టున ఉన్నటువంటి పీ అండ్ టీ కాలనీ తరచు ఇబ్బందులు పడుతున్న వరదనీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక చొరవచూపుతానని హామీనిచ్చారు.
Admin
Aakanksha News