Thursday, 30 July 2026 04:22:19 PM

బతుకమ్మని అవమానించేలా మాట్లాడిన మంత్రులపై చర్యలు తీసుకోవాలి..

Date : 13 December 2024 05:27 PM Views : 663

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బతుకమ్మని అవమానించేలా మాట్లాడిన మంత్రులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసారు. తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని చెప్పారు. తెలంగాణ తల్లిపై రేవంత్‌ రెడ్డి సర్కార్‌ గెజిట్‌ ఇవ్వడం దారణమన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా భరతమాత విగ్రహంపై గెజిట్‌ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకున్నామని, జీవో ఇస్తేనే వారి విగ్రహాలు పెడతామా అని ప్రశ్నించారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి జీవో ఇచ్చారన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజలు కాదన్నారు. ఆ పార్టీది తెలంగాణ వాదం కాదని, కాంగ్రెస్‌ వాదమని విమర్శించారు.మీరు ముమ్మాటికీ కాంగ్రెస్‌ వాదులే తప్ప తెలంగాణ వాదులు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ వాళ్లకు ఓట్లు ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు గుర్తుకు వస్తారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకుని ప్రశ్నిస్తున్నారని, ఇందిరాగాంధీ, సోనియా, రాహుల్‌ కూడా బతుకమ్మ ఆడారన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించామని చెప్పారు. జీవో కూడా విడుదల చేశామని గుర్తుచేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా తెలంగాణ తల్లిని నిలుపుకుంటామన్నారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. బతుకమ్మని అవమానించేలా మాట్లాడిన మంత్రులపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మని తొలగించి చెయ్యిగుర్తు పెట్టారని ఆరోపించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :