ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సూర్యాపేట జిల్లా : శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగమా ? ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో నా? అని ప్రశ్నించారు. ఆర్థిక విద్వంసం కాదు .. ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చామని అన్నారు. అప్పుల పేరుతో పథకాల నుంచి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అబద్ధాలు చెప్పడం వలన అభాసుపాలు కావడం తప్ప ఏమీ ఉండదన్నారు.తొమ్మిదిన్నరేళ్ల పాలన మీద బురద చల్లే కంటే 6 గ్యారంటీల అమలు మీద కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ వహిస్తే మంచిదని హితవుపలికారు. విద్యుత్ శాఖలో రూ.86 వేల కోట్ల అప్పులను చూపడం హస్యాస్పదమన్నారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లోబడి అత్యంత తక్కువగా రుణాలు తీసుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అవునా ? కాదా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు మాని ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని బాగు చేయకున్నా నష్టం చేయకుంటే చాలన్నారు. మొత్తం గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ఈ పది సంవత్సరాలలో తిరోగమనంలో ఉంది అన్నట్లు చెప్పారని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News