ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తొలిమెట్టు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతి గణనీయంగా మెరుగుపడిందని జిల్లా విద్యాశాఖ అధికారిణి డి.మాధవి పేర్కొన్నారు. శనివారం గోదావరిఖని గాంధీ నగర్ లోని గాంధీ పార్క్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన పాఠశాల విద్యా కమిటీ, తల్లిదండ్రుల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి మెట్టు కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వినూత్న పద్ధతులలో బోధన కొనసాగించడంతో విద్యార్థులలో అభ్యసనా సామర్థ్యాలు మెరుగు పడ్డాయని ఆమె పేర్కొన్నారు. దీని ఫలితాలను ఉన్నత పాఠశాలలకు కూడా చేర్చాలని ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం ఉన్నత పాఠశాలలలో కూడా తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను అభివృద్ధి పరచడం జరుగుతుందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలలోగాని, విద్యాబోధనలోగాని ప్రభుత్వ పాఠశాలలు ఎంతో ముందంజలో ఉన్నాయన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంథని మధునయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి జక్కం శ్రీనివాస్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చెరుకూరి ఇజ్రాయిల్, అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Admin
Aakanksha News