ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : వివాదాలకు దూరంగా సింగరేణిలో సౌమ్యుడిగా కార్మికుల్లో మంచి గుర్తింపు ఉన్న మిర్యాల రాజిరెడ్డికి లైన్ క్లియర్ అయిందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) లో కీలకంగా వ్యవహరిస్తూ సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిపించేందుకు తనదైన శైలిలో కార్యక్రమాలను నిర్వహిస్తూ తనతో పాటు ఉన్న క్యాడర్ ను, నాయకులను కలుపుకొని వెళ్లి పార్టీ ఆదేశానుసారం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం సింగరేణి వ్యాప్తంగా 7వ సారి జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీలో ఉంటుందని భావించారు. కానీ చివరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి జరిగే సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయవద్దని యూనియన్ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆసంతృప్తి చెందిన TBGKS అగ్ర నాయకులు బి.వెంకట్రావు మిర్యాల రాజిరెడ్డి, కేంగర్ల మల్లయ్యలు యూనియన్ కు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ముగ్గురి నాయకులకు సంబంధించిన క్యాడర్ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. అయితే మిర్యాల రాజిరెడ్డి తన సన్నిహితులు, అనుచరులు, క్యాడర్ తో సంప్రదింపులు జరిపి వారి నిర్ణయం మేరకు కీలక పార్టీలోని యూనియన్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ చేరికకు సంబంధించి ఆయా పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఓ అగ్రనాయకత్వం నాయకుడి నుండి పిలుపు వచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. దీనికి మిర్యాల రాజిరెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ చేరికకు సంబంధించి మిర్యాల రాజిరెడ్డి హైదరాబాద్ నుండి వచ్చిన అనంతరం సన్నిహితులతో పాటు తన క్యాడర్, అనుచరులతో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం...
Admin
Aakanksha News