ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బ్రిలియంట్ గ్గామర్ హై స్కూల్ అనుమతులను రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వరంగల్ RJD సత్యనారాయణ రెడ్డి, డీఈఓ మాధవి ఇచ్చిన అధికారిక ఉత్తర్వుల మేరకు రామగుండం ఎంఈఓ సంపత్ రావు స్వయంగా పాఠశాల నోటిస్ బోర్డు కు అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల ను అతికించారు. ఈ మేరకు ఎంఈఓ సంపత్ రావు మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ గుర్తింపును రద్దు చేశామని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో చదివే విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. గతంలో ఎన్నోసార్లు పాఠశాల యాజమాన్యానికి చెప్పిన నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దీంతో పాఠశాలపై ఉన్నతధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లు విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకుంటూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని అన్నారు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలను దండుకున్న పాఠశాల యాజమాన్యం గుర్తింపు రద్దు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు చెల్లించిన ఫీజులపై ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ పాఠశాల యాజమాన్యంపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ సంపత్ రావు స్పష్టం చేశారు.
Admin
Aakanksha News