ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సిట్ అధికారుల బృందం మల్యాల మండలంలో పర్యటించారు. లీకేజ్ కేసులో మల్యాల తెరపైకి రావడం, అలాగే A2 ముద్దాయి అట్ల రాజశేఖర్ రెడ్డి ఇక్కడి నివాసి కావడంతో సిట్ అధికారులు పరీక్షలు రాసిన అభ్యర్థులను విచారించేందుకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అధికారులు రాజశేఖర్ రెడ్డి స్వగ్రామానికి చేరుకొని మండలంలో పర్యటించారు. అలాగే పరీక్షలు రాసిన అభ్యర్థుల వివరాలు సేకరించారు. సుమారుగా 20 నుంచి 30 మంది అభ్యర్థులను మల్యాలలో బ్లాక్ సమీపంలో ఓ చోటుకి పిలిపించి లోతుగా విచారించారు. దీంతో పాటు అధికారులు అభ్యర్థుల కుటుంబ స్థితి గతులు, వ్యక్తిగత వివరాలు, పరీక్షలు రాసిన విధానం, ఎక్కడ చదివారు. కోచింగ్ సెంటర్ల వివరాలు కొత్త పరిచయాలు, తదితర ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. 100 మార్కులు దాటిన వారితో పాటు, అంత లోపు అభ్యర్థులను సిట్ బృందం విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ అధికారుల బృందంలో సీఐ రవికుమార్, ఎస్సైలు దేవసురేష్, తిరుపతి, సిబ్బంది ఉన్నారు.
Admin
Aakanksha News