ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రాముడు తిరిగిన నేలలో.. రావణాసురుడిని తరిమికొట్టాలని బిజెపి అభ్యర్థి కందుల సంధ్యారాణి విమర్శించారు. ఈ సందర్భంగా గోదావరిఖని సప్తగిరి కాలనీలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సంధ్యారాణి మాట్లాడుతూ... రామగుండం నియోజక వర్గంలో కొంత మంది నాయకులు అవినీతిని లీగల్ గా మార్చుకొని కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం ద్వారా సమర్థవంతమైన పాలన అందిస్తామన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో ఎంతో మంది యువకులను ఈ ప్రాంత నాయకులు మోసం చేశారని వారిని ప్రజలు నిలదీసే పరిస్థితులు వచ్చాయన్నారు. సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారని నరేంద్ర మోడీపై అధికార పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని కూడా అందించలేని పరిస్థితులు నెలకొన్నయన్నారు. రామగుండం ఆడబిడ్డగా మహిళా అభ్యర్థిగా బిజెపి నాయకత్వాన్ని బలపరిచి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను సంధ్యారాణి కోరారు. దేశంలో నరేంద్ర మోడీ సమర్థవంతమైన పాలన అందిస్తూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంత మహిళలకు యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. వరదలతో సప్తగిరి కాలనీ మునిగిన సమయంలో కనీసం ప్రజలను ఆదుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు. ఒక్క అవకాశం ఇస్తే రామగుండం నియోజకవర్గంను అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు తెలిపారు. అనంతరం బిజెపిలో చేరిన సుమారు 200 మంది మహిళలకు పార్టీ కండువా కప్పి బిజెపిలోకి సంధ్యారాణి ఆహ్వానించారు.
Admin
Aakanksha News