Saturday, 13 June 2026 02:40:28 PM

అద్దంకి దయాకర్‌ స్థానంలో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేరు ఖరారు...

Date : 17 January 2024 06:36 PM Views : 436

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణలో జరుగనున్న రెండు శాసనమండలి ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్‌ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసి 24 గంటలు కూడా కాలేదు అద్దంకి దయాకర్‌ స్థానంలో మరొకరి పేరును ప్రకటించింది కాంగ్రెస్‌. మహేశ్‌కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ఉప ఎన్నికల కోసం బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ అభ్యర్థిత్వాన్ని అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఖరారు చేసినట్లు ఆ పార్టీ జనరల్‌ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బల్మూరి వెంకట్‌, అద్దంకి దయాకర్‌కు గ్రీన్‌ సిగ్నలిచ్చినట్లు పత్రికలు, టీవీల్లో వార్తలు కూడా వచ్చాయి. ఇపుడు పార్టీ సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌కు టికెట్‌ ఇవ్వకుండా ఆయన స్థానంలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అధిష్ఠానం టికెట్‌ ఖరారు చేసింది.ప్రస్తుతం అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్‌ ఆశించారు. చివరకు ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. ఆయన స్థానంలో మరొకరికి టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. అద్దంకికి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఖరారైందని విపరీతంగా ప్రచారం జరిగింది. ఉప ఎన్నికల్లోనూ మరోసారి మొండి చేయి చూపింది. ఇదిలా ఉండగా.. నామినేషన్ల గడువు గురువారంతో ముగియనున్నది. 29న రెండు స్థానాలకు పోలింగ్‌ జరుగనున్నది. ఆ తర్వాత కౌంటింగ్‌ నిర్వహించి.. విజేతలను ప్రకటించనున్నారు. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల పదవీకాలం 2027 నవంబర్‌ వరకు ఉండనున్నది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :