ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ రాష్ట్ర శాసనసభ 'ప్రభుత్వ విప్' గా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ నియమితులయ్యారు.ఈమేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులనిచ్చారు.డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ ఉన్నత విద్యావంతుడు. ఉస్మానియా మెడికల్ కళాశాల నుండి ఎంబిబిఎస్, ఎం.ఎస్. లను పూర్తి చేసారు. వైద్య వృత్తిలో ప్రజలకు విశేష సేవలను అందించారు. ఒకవైపు విద్యా, వైద్య, సామాజిక రంగాల్లో సేవలను అందిస్తూనే మరోవైపు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2018 ఎన్నికల్లో డాక్టర్ నాయక్ డోర్నకల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెడ్యానాయక్ పై పోటీ చేసి ఓటమి చెందారు. ఇటీవల 2023 లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ రాంచంద్రు నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డోర్నకల్ నుడే మళ్లీ పోటీ చేసి అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెడ్యానాయక్ ను 53,131 ఓట్ల భారీ మెజార్టీతో ఓడించారు.తనపై విశ్వాసముంచి 'ప్రభుత్వ విప్' గా నియమించినందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధి, అగ్రనేతలైన రాహూల్ గాంధి, ప్రియాంక గాంధి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి లకు డాక్టర్ రాంచంద్రు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నిలిపిన నమ్మకాన్ని వమ్ము చేయనని, ప్రభుత్వ మరియు పార్టీ ఔన్నత్యాన్ని పెంచేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని డాక్టర్ రాంచంద్రు నాయక్ తెలిపారు.
Admin
Aakanksha News