ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నాలుగు జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వక పోవడంపై న్యాయస్థానం మండిపడింది. నాలుగు నెలల్లో బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామన్న ప్రభుత్వం.. ఏడాది గడుస్తున్నా నిర్లక్ష్యం వహించడంపై హైకోర్టు ఈ నోటీసులను జారీ చేసింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించడం లేదని కొండల్రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఈ మేరకు జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు పంపింది. కోర్టు ధిక్కరణ ఎందుకు కాదో చెప్పాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Admin
Aakanksha News