ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఈటెల రాజేందర్ ఒక్క వైట్ కాలర్ క్రిమినల్ అని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... డైరీ ఫామ్ తో మొదలు పెట్టి భూములు, స్కాములు చేసిన వైట్ కలర్ ఈటెల రాజేందర్ ను బిఆర్ఎస్ పార్టీ మంత్రి పదవి నుండి తొలగించారని అన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నాలు చేస్తే ఆయనను ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వలేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ పై డబ్బులు తీసుకున్నారని ఈటెల రాజేందర్ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహిస్తూ పాదయాత్రలు చేస్తుంటే ప్రజలు తమ సమస్యలను స్వచ్ఛందంగా వచ్చి తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పై అవినీతిపరుడు ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను తను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బీసీ నాయకుడిగా చెప్పుకుంటూ పార్టీ నుండి సస్పెండ్ చేసిన అనంతరం ప్రజల మద్దతును కూడగట్టుకోవడానికి హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రాజీనామా చేసి గెలిచిన ఈటల రాజేందర్ మళ్లీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజరాబాద్ లో మళ్లీ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఈసారి హుజరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు కనీసం డిపాజిట్ కూడా రాదని అన్నారు. అయితే పార్టీలో మెప్పు పొందడానికి ఈటల రాజేందర్ తన సొంత పార్టీ నాయకుడు బండి సంజయ్ కి వెన్నుపోటు పొడిచే అందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులపై, పార్టీపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పెద్దపల్లి జిల్లాలో జరిగిన బట్టి విక్రమార్క పాదయాత్రను విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మహాకాళి స్వామి, కాల్వ లింగస్వామి, ముస్తఫా, పెద్దెల్లి ప్రకాష్, గట్ల రమేష్, గాదం నందు, శంకర్ తిరుపతి తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News