ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : చిన్న పిల్లల ఆటల్లో మొదలైన గొడవ పెద్దవాళ్ల ప్రాణం తీసుకునే వరకు వెళ్లింది. హైదరాబాద్ లోని పటాన్ చెరులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన గణేశ్, శిరీష నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా శిరీష కూతురు పల్లవి పక్కింటి పిల్లలతో ఆడుకుంటు ఉంది. ఆటల్లో పిల్లల మధ్య గొడవ జరగడంతో ఇంట్లోకి వెళ్లి తల్లితో చెప్పింది.దీంతో శిరీష పక్కింటి పిల్లలను మందలించగా ఆ పిల్లల తల్లిదండ్రులు గొడవకు వచ్చారు. ఇద్దరూ నోటికి వచ్చినట్లు తిట్టడంతో శిరీష అవమానంగా భావించింది. ఈ విషయం భర్తకు ఫోన్ చేసి చెప్పింది. రాత్రి ఇంటికి వచ్చిన గణేశ్ ను పక్కింటి వారిని నిలదీయాలని అడిగింది. అయితే గొడవను ఇంకా పెద్దది చేయడం ఎందుకనే ఉద్దేశంతో గణేశ్ ఈ విషయాన్ని దాట వేశాడు. భర్త తీరుతో మరింత అవమానంగా ఫీలయిన శిరీష.. అదే రాత్రి గదిలో ఉరేసుకుని మృతి చెందింది. కూతురు మరణవార్త విని అల్లుడి ఇంటికి వచ్చిన శిరీష తల్లిదండ్రులు శిరీష మృతిపై సందేహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Admin
Aakanksha News