ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : రాజకీయ వేదికపై సంచలనానికి సంచలనాన్ని జోడించేలా మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపాయి. ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన ప్రసంగంలో హామీల విషయంలో పూర్తిగా చేతులెత్తేశారు.నేను ఎలాంటి హామీలు ఇవ్వను. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో నాకు తెలియదు. నేనూ గెలుస్తానో లేదో చెప్పలేను. కాబట్టి హామీలు ఇవ్వడం సరైంది కాదని భావిస్తున్నా," అని మంత్రి బహిరంగంగా వ్యాఖ్యానించారు. జనాభాగస్వామ్యం, వాస్తవ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలని సూచించిన జూపల్లి, "నా వంతుగా ప్రయత్నం చేస్తాను. నా నియోజకవర్గంలోనూ ప్రజలకు కావలసిన పనులు చేస్తాను. కానీ హామీలతో మోసం చేయను. అభివృద్ధి పనులు ఏవైనా అవసరమైతే వాటిని ముందుకు తీసుకువెళ్తా," అని స్పష్టం చేశారు.మంత్రి వ్యాఖ్యలు వినిపించగానే సభలో ఒక క్షణం స్తబ్దత నెలకొంది. సాధారణంగా నాయకులు ఎన్నికల దిశగా హామీలు, భవిష్యత్ వాగ్దానాలు చేస్తుంటే, వాటికి విరుద్ధంగా మంత్రి జూపల్లి వైఖరి ఆశ్చర్యపరిచింది. పార్టీ అంతర్గతంగా ఇప్పటికే సంక్షోభ పరిస్థితులు నెలకొన్న వేళ, ఆయన మాటలు కాంగ్రెస్ నాయకత్వాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రజలు కోరుకునే పనులు చేయడమే తనకు ముఖ్యమని, కానీ అధికార భవిష్యత్తుపై ఎలాంటి ధీమా లేదని చెప్పడం ద్వారా జూపల్లి వాస్తవ రాజకీయ పరిస్థితులను అద్దం పట్టినట్లే అని పర్యవేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు.జూపల్లి వ్యాఖ్యలతో మహబూబ్నగర్ కాంగ్రెస్ శ్రేణుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఆయన నిజాయితీని ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం పార్టీకి ఇబ్బందులు తెచ్చే వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నారు.
Admin
Aakanksha News