ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం సింగరేణిలో జరగబోయే కార్మిక సంఘం ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో గతంలో గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పరిస్థితి సింగరేణి వ్యాప్తంగా ప్రశ్నార్థకంగా మారింది.ఇప్పటికే సింగరేణిలో పాగా వేసేందుకు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బిఎంఎస్ కార్మిక సంఘాలు సింగరేణి బొగ్గు బావుల మీద తమదైన శైలిలో కార్మికుల వద్ద తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.అయితే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఈసారి పోటీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకడుగు వేయడంతో ఈ నిర్ణయంపై ఆ యూనియన్ నేతల్లో కలవరం మొదలైంది. దీంతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి అగ్ర నేతలు బి.వెంకట్రావు మిర్యాల రాజిరెడ్డి, కేంగర్ల మల్లయ్యలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ మరో యూనియన్ లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈక్రమంలో సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యూనియన్ పరిస్థితి అయోమయంగా మారడంతో కింది స్థాయి నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారి నాయకుని వెంటే వెళ్లేందుకు ఇప్పటికైనా సిద్ధం చేసుకుంటున్నట్లు జోరుగా సింగరేణి వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది.అయితే ఎన్నికల్లో పోటీ వద్దని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో ఈ నిర్ణయంపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ముగ్గురు అగ్రనేతలు అసంతృప్తి చెందారు.దీంతో వారు ఆ యూనియన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నేడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Admin
Aakanksha News