ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : హంగు ఆర్భాటాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్పొరేట్ పాఠశాలలను ఏర్పాటు చేసుకొని విద్యాశాఖ నిబంధనలను కొన్ని పాఠశాలలు తుంగలో తొక్కుతున్నారు. కనీసం నియమ నిబంధనలు కూడా పాటించకుండా వారి ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఓ కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థిడిని పాఠశాల ప్రిన్సిపల్ చితకబాదిన విషయం మరువకముందే పారిశ్రామిక ప్రాంతంలోని మరో పాఠశాల బాగోతం బయటపడింది. మార్కండేయ కాలనీలోని ఒకానొక పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఘర్షణలో గాయాల పాలైన విద్యార్థినిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో పాఠశాల సిబ్బందిపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.అయితే ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ఇప్పటికే పాఠశాల యాజమాన్యం కొంత మందితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే పాఠశాలలో ఫీజుల కుంభకోణం జరగడంతో పెద్ద ఎత్తున పాఠశాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. అయితే పారిశ్రామిక ప్రాంతంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలో ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ఇలాంటి పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Admin
Aakanksha News