ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పవర్ హౌస్ కాలనీలోని జనగామ, మల్కాపూర్ శివారులో భూ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కార్యదర్శి వై.యాకయ్య మాట్లాడుతూ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో వేలాదిమంది ఇండ్లు లేకుండా కిరాయిలు ఉంటున్నారని పేర్కొన్నారు.చేసిన పనికి సరైన వేతనాలు లేకుండా వచ్చిన జీతం కిరాయిలకే సరిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆయన మండిపడ్డారు.కట్టిన ఇండ్లు కూడా ఇంత వరకు కేటాయించక పోవడం ఇంకా కొన్ని అసంపూర్తిగా మిగిలిపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కాకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని అన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల డ్రా లో కూడా అర్హులకు ఇండ్లు దక్కకపోవడం చాలా దారుణం అన్నారు. ఇందులో కూడా రాజకీయం జరిగిందని ఆరోపించారు. పేదలకు ఖాళీ స్థలాలు ఇవ్వాలని అనేక సార్లు విన్నవించినా ఖాళీ స్థలాలు లేవని ప్రభుత్వం దాటవేస్తూ వచ్చిందని పేర్కొన్నారు.కానీ ప్రభుత్వ భూముల్లో కొంత మంది భూ బకాసురులు భూ కబ్జాలకు పాల్పడుతున్న ప్రభుత్వం పట్టించుకోక వారికే వత్తాసు పలుకుతూ ఉందని అన్నారు. సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వ ఖాళీ స్థలాలు చూపుతాం మీరు పట్టాలు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.ఒక రకంగా సీపీఎం పార్టీ భూ పోరాటం చేయడం అంటే కబ్జా దారుల నుండి ప్రభుత్వ భూమిని రక్షించడమే అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూములు కబ్జాలనుండి కాపాడి అసలైన ఇండ్ల స్థలాలు లేని పేదలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి, ఎం.రామాచారీ, జిల్లా కమిటీ సభ్యులు మెండే శ్రీనివాస్, జి.జ్యోతి,ఎన్.శంకర్, ఎస్.రవీందర్,కె.అశోక్,నాయకులు టి.రాజారెడ్డి, ఓదెలు, లలిత, రమణ,ఫైముదా,పీర్ మహ్మద్, ఉపేందర్, రాములు, లక్ష్మీనారాయణసంజీవ్,సాగర్,కృష్ణ, సురేష్,రవి,గౌస్ లతో పాటు సుమారు 5 వందల మంది ప్రజలు,కార్మికులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News