ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని బీసీ సంఘం రాష్ట్ర అద్యక్షులు చెరుకుల రాజేందర్ ముదిరాజ్ డిమాండ్ చేసారు.స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్ల సుదీర్ఘ కాలంలో రెడ్లు, కమ్మలు, వెలమలు రాజ్యమేలారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదని, పట్టించుకునే వారే లేకుండా పోయారన్నారు. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల అగ్రనేతల వరకూ తమ, తమ పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు.. బీసీలను వాడుకుంటున్నారని...ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే రెడ్డి, కమ్మ, వెలమలకు అధికారం కట్టబెడుతున్నారన్నారు. అగ్ర కులస్తులకు కీలక పదవులు అప్పగించి బీసీలను విస్మరిస్తున్నారని రాజేందర్ ముదిరాజ్ విమర్శించారు. ఇలాంటి రాచరికపు వ్యవస్థను రూపుమాపేందుకు జనాభాలో 60శాతంపైగా ఉన్న బీసీలకు సీఎం పదవి దక్కాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చట్టసభలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయ రిజర్వేషన్లు కల్పించే వరకు దేశవ్యాప్తంగా బీసీల అందరిని ఏకతాటి మీకు తీసుకొస్తూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Admin
Aakanksha News