Thursday, 30 July 2026 10:48:04 PM

‘కులగణన సర్వే పత్రాలను తగలబెడితేపార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా...?

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

Date : 06 March 2025 06:37 AM Views : 554

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడున్నారనే కారణంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ కొద్ది రోజుల క్రితం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మల్లన్న బుధవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘కులగణన సర్వే పత్రాలను తగలబెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తల ఎత్తుకునేలా సర్వే జరగాలని ముఖ్యమంత్రికి సూచించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. అందుకే రేవంత్ రెడ్డి తనను సస్పెండ్ చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిసిలకు గట్టి మద్ధతు లభించిందని.. భవిష్యత్తులో మరింత బలంగా పోరాడుతామని అన్నారు. తనను సస్పెండ్ చేస్తే బిసిలు ప్రశ్నించరనే భ్రమ నుంచి రేవంత్ బయటకు రావాలని అన్నారు. అంతేకాక.. సమగ్ర కుటుంబ సర్వేను కెసిఆర్ పకడ్బందీగా నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కులగణన సర్వేలో అగ్రవర్ణాలను ఎక్కువగా.. బిసిలను తక్కువ చూపించారని ఆరోపించారు. కులగణన సర్వే చేస్తానని హామీ ఇచ్చారు కాబట్టే తాను కాంగ్రెస్ చేరానని తెలిపారు. కెసిఆర్‌పై తాను పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ నేతలంతా ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి పరోక్షంగా బిజెపికి సహకరిస్తున్నారని అన్న మల్లన్న.. సంవత్సరం లోపే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 2028లో బిసినే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని ఆయన అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :